ధాన్యం సేకరణపై కేంద్రాన్ని నిలదీస్తూ పార్లమెంటులో ప్లకార్డులు ప్రదర్శించిన టీఆర్ఎస్ ఎంపీలు 

  • నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు
  • ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని నిలదీసిన టీఆర్ఎస్ ఎంపీలు
  • రైతు అనుకూల విధానం ప్రకటించాలని డిమాండ్
  • ఎదుగుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దని వినతి
పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు అంశంపై టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని నిలదీశారు. ధాన్యం సేకరణపై కేంద్రం తమ విధానాన్ని ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. వెంటనే జాతీయ రైతు ఉత్పత్తుల విధానాన్ని ప్రకటించాలని స్పష్టం చేశారు. రైతులను శిక్షించవద్దని, ఎదుగుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో సీఎం కేసీఆర్ దార్శనికత వల్ల రైతులకు సమృద్ధిగా సాగునీరు, ఎరువులు, విత్తనాలు, రైతు బంధు వంటి పథకాలు అమలవుతున్నాయని వారు వెల్లడించారు. పథకాలకు తోడు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందడం వల్ల దిగుబడులు పెరిగాయని, అందుకు తగిన విధంగా ఎఫ్ సీఐ కొనుగోళ్లను పెంచాలని డిమాండ్ చేశారు.

రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అవసరమైన విధానాలను తీసుకురావాలని కోరారు. అప్పటివరకు రైతుల కోసం తమ ఆందోళనలు, ఉద్యమం కొనసాగుతాయని టీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు.

TRS
MPs
Placards
Paddy
Centre
Parliament

More Telugu News